ఏపీ రాజకీయాలలో వలసలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలలోకి ఈ వలసలు జరుగుతుండటం విశేషం. ఒకపార్టీ నుండి మరో పార్టీలోకి ఈ వలసలు జరుగుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో కూడా అర్ధం కానీ పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలు ఉండడం గమనార్హం. అసలు ఏ పార్టీ ని ప్రజలు ఆదరిస్తారో తెలియని అయోమయ స్థితిలో ఈ వలసలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా, టీడీపీ నుండి వైసీపీ లోకి మరో నాయకుడు జంప్ అవడానికి సిద్ధం అయ్యాడు.
గతంలో మంత్రి అఖిలప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ మాజీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధమైనట్టే తెలుస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేడు ఇరిగెల భేటీ కానున్నారు. టీడీపీ ఇన్చార్జ్గా పనిచేసిన ఇరిగెల పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే, మంత్రి అఖిలప్రియతో ఉన్న విభేదాల కారణంగా పార్టీకి దూరం జరిగారు. గతేడాది డిసెంబరు 28న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీలో చేరనున్నారు.