వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు వచ్చే బుధవారం నాడు తుది తీర్పు వెలువరించనుంది. బుధవారం లోపు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాశ్ చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. బుధవారం తీర్పు వెలువరించేవరకూ అవినాశ్ను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై శనివారం నాడు సీబీఐ వాదనలు వినిపించింది. శుక్రవారం నాడు అవినాశ్ తరపు లాయర్, సునీత తరపు లాయర్ వాదనలను తెలంగాణ హైకోర్టు విన్న సంగతి తెలిసిందే. శనివారం నాడు (మే 27, 2023) సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. అవినాశ్కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాశ్ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అవినాశ్రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులిచ్చినా అవినాశ్రెడ్డి పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తులో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తు తమ పద్ధతి ప్రకారం చేస్తాం కానీ అవినాశ్ కోరుకున్నట్లు కాదని సీబీఐ తరపు లాయర్ అనిల్ కోర్టుకు స్పష్టం చేశారు.