తెలంగాణ రాష్ట్రం లో కీలక సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని కాంగ్రెస్పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన ఆయనను బుధవారం ఖమ్మం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణను మిగులు బడ్జెట్తో అప్పగిస్తే.. ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు.
శాసనసభలో ప్రజా గొంతుకలా వ్యవహరిస్తానని దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీలకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పొదెం వీరయ్య, బాణోతు హరిప్రియ పాల్గొన్నారు.