గుంటూరులోని జేకేసీ రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ను హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబులు పాల్గొన్నారు.
సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలన్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయం అన్నారు. ఆయన స్పూర్తితోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రాజకీయ ఉద్దేశంతో వైసీపీ అన్న క్యాంటీన్లను రద్దు చేసిందని బాలకృష్ణ ఆరోపించారు. పేద ప్రజలకు ఐదు వేళ్లు నోట్లోకి పోనివ్వకుండా చేసిందని మండిపడ్డారు.
ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని బాలకృష్ణ విమర్శించారు. తెలుగు ప్రజల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటవుతాయని ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందన్న బాలయ్య.. దాని ప్రభావమే ప్రజలపై పన్నుల బాదుడే బాదుడు అని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తోందని బాలకృష్ణ అన్నారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలు ఉద్యమించాలని కోరారు. తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.