ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లిలో వైసీపీ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు.
ప్రజలు తమకు ఐదేండ్లు పరిపాలన కోసం గెలిపించారని, దానిని తగ్గించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు.ప్రజలను మోసం చేసేవారు, భ్రమలో ఉంచేవారే ముందస్తుకు వెళ్తారని, చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని వ్యాఖ్యనించారు.
వైఎస్ఆర్పీసీపీ కార్యకర్తల డీఎన్ఏ వేరు. వైఎస్ఆర్ కుటుంబంతో వారి బంధం విడదీయలేనిది. వైసీపీ వాళ్లు వేరే పార్టీలోకి వెళ్తున్నారనడం వారి భ్రమ. మా పార్టీకే డిమాండ్ ఎక్కువ. ఇతర పార్టీలోకి ఎందుకు వెళ్తారు. పదవులు ఆశించిన వారైతే ఇక్కడ ఉంటారు. అధికారంలోని లేని పార్టీలోకి ఎవరు వెళ్తారు?” అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.
అలాగే.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే రెండున్నర సంవత్సరాలకు కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారని వెల్లడించారు.పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ తమకు కీలకమేనని వెల్లడించారు. అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్లను పార్టీకి వినియోగించుకుంటామని చెప్పారు.