వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోదరుడు, వివేకానందరెడ్డి(68) తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో ఆయన చివరి శ్వాస విడిచారు. ఆయన మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీ గా పనిచేశారు. ఆయన మృతితో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. పార్టీ పనులలో జగన్ కు అన్నివిధాలా సహకరిస్తూ చురుగ్గా ఉన్న ఆయన గతరాత్రి స్వగృహానికి వచ్చారు. అయితే తెల్లవారు జామున వాంతి అవుతుందని.. స్నానాలగదిలోకి వెళ్లడం, అక్కడ గుండెపోటు రావటం జరిగింది. దీనితో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవటంతో సాయం చేయడానికి కూడా ఎవరు లేకుండాపోవటంతో.. ఈ విషాదం సంభవించిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
కడపలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. వై.ఎస్. రాజారెడ్డి తనయుడిగా, రాజశేఖర్ రెడ్డి సోదరుడిగా రాయలసీమ గడ్డపై పులిబిడ్డగా ఎదిగారు. అన్న చాటున ఉన్నా, తనదైన శైలిలో రాజకీయాలలో అడుగులు వేశారు. అన్న ఢిల్లీలో ఉన్నా, సీఎం గా రాజధానిలో ఉన్నా జిల్లా రాజకీయాలు మాత్రం వివేకానందరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. 1950, ఆగష్టు 8న ఆయన జన్మించారు. ఎంపీగా రెండు సార్లు, ఎమ్మెల్యే గా రెండు సార్లు విజయం సాధించారు. మూడు దశాబ్దాల పాటు ప్రజాసేవ చేశారు.