వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసుల రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నేరుగా రంగంలోకి దిగారు. ఈరోజు కడపలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే శ్రీనివాసుల రెడ్డి ఆత్మహత్యపై అధికారులను డీజీపీ ప్రశ్నించగా, దర్యాప్తు వివరాలను జిల్లా పోలీస్ అధికారులు సవాంగ్ కు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తుతెలియని దుండగులు జమ్మలమడుగులోని ఇంట్లో కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు జరిగిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.