* వివేకానంద హత్య కేసు కడప కోర్టుకు కేసు బదిలీ..
*వివేకా హత్యకేసులో దస్తగిరి స్టేట్ మెంట్..
*సిబీఐకిఅప్రూవర్ స్టేట్మెంట్ రాసిచ్చిన దస్తగిరి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. ఇప్పటివరకు ఈ కేసు విచారణను పులివెందుల కోర్టు నిర్వహిస్తోంది.అయితే సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.
ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరగే విధంగా ఆదేశించారు. పులివెందుల కోర్టుకు హాజరైన నలుగురు నిందితులకు సీబీఐ అభియోగ పత్రాల వివరాలను మెజిస్ట్రేట్ తెలియజేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు మంగళవారం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అనారోగ్య కారణాలతో దేవిరెడ్డి శివశంకర్రెడ్డి హాజరుకాలేదు
కాగా..2019 మార్చి మాసంలో వైఎస్ వివేకానందరెడ్డిని స్వగృహంలోనే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసు విచారణను సీబీఐ చేస్తోంది.
అయితే ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను దస్తగిరి సిబిఐ అధికారులకు ఓ వాంగ్మూలం ఇచ్చాడు.
ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని ఉమాశంకర్రెడ్డి తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమంది శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు.
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.