తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. ఇప్పుడు అసలు నిందితుల పాత్రపై దర్యాప్తు సాగిస్తోంది.
ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, వాచ్మెన్ రంగన్నలకు భద్రత కల్పించాలని గతంలో సీబీఐ కోరగా.. కడప కోర్టు అందుకు అంగీకరించి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
కడప కోర్టు ఆదేశాల మేరకు పోలీసుశాఖ సోమవారం కడప కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దస్తగిరి, రంగన్నలకు..ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్ల ను కేటాయిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది..
మరోవైపు వివేకా కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆమె కోరారు. దీంతో ఈ పిటిషన్ పై హైకోర్టు తదుపరి వాదనలను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.
అలాగే ప్రస్తుతం జైల్లో ఉన్న ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్ల కోసం కడప కోర్టును, హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ బెయిల్స్ వ్యవహారం కూడా చర్చనీయాంశమవుతోంది.