ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అనూహ్యంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురు తెలంగాణలో పార్టీ పెట్టడం పెద్ద సంచలనమే రేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా తాను తెలంగాణ కోడలినే అంటూ తన తండ్రి పేరుమీదనే వైఎస్సార్టీపీ పార్టీని పెట్టింది. అయితే తన అన్నతో సఖ్యత లేక విభేదాలు వచ్చి ఇలా పార్టీ పెట్టిందనే చర్చ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇక ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి తన తల్లి విజయమ్మ వెన్నంటే ఉంటున్నారు. కానీ జగన్ మాత్రం ఆమె పార్టీపై కనీసం స్పందించట్లేదు.
తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటంతో షర్మిలపై మొదటి నుంచి ఆంధ్రా ముద్ర బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగా ఆమె పార్టీలో కనీసం చెప్పుకోదగ్గ లీడర్ కూడా జాయిన్ కావట్లేదు. అయినా కూడా ఆమె నిరుద్యోగుల తరఫున ఎన్ని నిరసనలు చేస్తున్నా కనీసం స్పందన లేదు. వైఎస్సార్ పేరును ఎంత బలంగా వినిపించాలని అనుకుంటున్నా కూడా ఫలితం రావట్లేదు. ఇక ఆమెకు మద్దతుగా ఇప్పుడు విజయమ్మ రంగంలోకి దిగారని చర్చ సాగుతోంది. అందుకోసమే తెలంగాణలో షర్మిలకు మద్దతుగా తమ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారిని ఏక తాటి మీదకు తెచ్చి తన కూతురుకు అండగా ఉండాలని కోరేందుకే పావులు కదుపుతున్నారంట.
ఇందులో భాగంగానే నిన్న వైఎస్సార్ 12వ వర్థంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఈ సమ్మేళనం కుటుంబ పరమైనది అనుకుంటే జగన్ రావాలి కదా. కానీ ఆయన కానీ ఒకప్పుడు వైఎస్సార్ కేబినెట్ లో మంత్రులుగా చేసి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న వారు కానీ హాజరు కాలేదు. ఒక వేళ ఈ సభ విజయమ్మ వ్యక్తిగతంగా ఏర్పాటు చేసింది అనుకుంటే షర్మిల ఈ సభకు వచ్చారు. అంటే ఈ సభ వ్యూహాత్మకంగానే షర్మిలకు మద్దతుగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడకుండా కేవలం వైఎస్సార్ తెలంగాణకు చేసిన మంచి పనులను ఈ సభలో వినిపించారు.
అయితే తెలంగాణలో టీ కాంగ్రెస్ తరఫున ఎవరూ హాజరు కావొద్దని రేవంత్ అంతర్గత ఆదేశాలు ఇచ్చినా కూడా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వచ్చారు. రేవంత్ వద్దనడానికి కారణం ఏంటంటే వైఎస్సార్ తమ పార్టీకి చెందిన వాడేనని అంటే కాంగ్రెస్ ఆస్తి అని ఆయన చేసిన పనుల క్రెడిట్ తమ పార్టీకే దక్కుతుందని వారు చెబుతున్నారు. ఈ ఆత్మీయ సభకు వెళ్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్కు దక్కకుండా షర్మిలకు వెళ్తుందనే కారణంతో ఎవరూ వెళ్లొద్దని సూచించారంట. అంటే ఎటు చూసుకున్నా కూడా ఈ సభ ఆత్మీయం కంటే కూడా రాజకీయం అనే తెలుస్తోంది. మరి వైఎస్ ముద్ర బలంగా పడాలని చూస్తున్న షర్మిల ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.