తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర చేవెళ్లనుంచి ప్రారంభమైంది. వైఎస్ విజయమ్మ షర్మిల చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని తెలిపారు. ఇదే చేవెళ్ల గడ్డ నుంచి 18 ఏళ్ల క్రితం తొలి అడుగు పడిందని గుర్తుచేశారు. తెలంగాణలోని ప్రతి పల్లెకు వస్తానని.. వారితో మమేకం అవుతానని షర్మిల ప్రకటించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని షర్మిల అన్నారు.
కేసీఆర్కు కుటుంబ సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని ఆమె విమర్శించారు. ప్రజల సంక్షేమం పట్టని కేసీఆర్ను… గద్దె దించడమే లక్ష్యమని ఆమె అన్నారు. కేసీఆర్ అవినీతిని బయట పెడతానని.. కేసీఆర్కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ను చీల్చి చెండాడుతానంటూ షర్మిల హెచ్చరించారు.
ఒక్కరోజు దీక్షచేస్తామంటేనే చిన్నదొర కేటీఆర్ గారికి జీర్ణం కాలేదు. వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడు పాదయాత్రలో ప్రతి రోజు మేము ప్రజల మధ్యనే ఉంటాము. ఇప్పుడేమంటారో అనండి చిన్నదొరా… అని అడుగుతున్నాను. ఆడదాన్ని అయ్యుండి ప్రజల పక్షాన.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నాను.
మరి మీరు అధికారంలో ఉండి ప్రజల పక్షాన.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏం చేస్తున్నారు..? దమ్ముంటే నాతో పాటు పాదయాత్రకు రండి.. సమస్యలు లేవు అని మీరు అంటున్నారు కదా..! కేసీఆర్ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా.. రండి.. నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి నేను ఇంటికి వెళ్లిపోతా… ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూపిస్తా.. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి. ఒకవేళ సమస్యలు ఉంటే మీరు క్షమాపణలు చెప్పి రాజీనామాలు చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి. దమ్ముంటే ఈ సవాలును స్వీకరించండి.
అరువు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మా పార్టీ ఎన్జీవో అన్నాడంట..నిజమే ..మేం సామాజం కోసం లాభం చూసుకోకుండా పని చేసేవాళ్లమే..రేవంత్ రెడ్డి లాగా మాకు బ్లాక్ మేయిలింగ్..కరప్షన్ చేతకాదు అని షర్మిళ అన్నారు.