తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇచ్చినట్లు చంద్రబాబు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తనకు రూ.1,000 కోట్లు ఇచ్చారని సీఏం చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయ్యా చంద్రబాబూ.. కేసీఆర్ నాకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినట్లు మీరు చూశారా? లేక కేసీఆర్ మీకు ఫోన్ చేసి నేను జగన్ కు వెయ్యి కోట్లు పంపించా అని చెప్పాడా అని నిలదీశారు.
చంద్రబాబు పార్టనర్, నటుడు పవన్ కల్యాణ్ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. ఈ యాక్టర్ గత ఐదేళ్లలో కేసీఆర్ ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు యెల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇతర అమ్ముడుపోయిన మీడియా వైసీపీని లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.కేసీఆర్ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏంటని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తున్నారనీ, వైసీపీకి ఇవ్వడం లేదని జగన్ తేల్చిచెప్పారు.