తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో వెళుతూ హైదరాబాద్ లో ఓ వృద్ధుడిని గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపి అతని సమస్యను తెలుసుకుని, పరిష్కరించిన సంగతి తెలిసిందే. సరిగ్గా అటువంటి ఘటనే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. నిన్న జగన్ కాన్వాయ్ ఏలూరు సమీపంలో వెళుతూ ఉండగా, ఓ కుటుంబం రోడ్డు పక్కన నిలబడి, కాగితాలు పట్టుకుని ఉండటాన్ని జగన్ గమనించారు. వెంటనే కాన్వాయ్ ని ఆపించి, వారిని దగ్గరకు పిలిపించుకున్నారు.
తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయలేదని, తమ ఊరిలో ఉన్న చాలా కుటుంబాలకు రాలేదని, ఇటీవలి వరదల తరువాత తమకు రూ. 5 వేల సాయం కూడా అందలేదని పాత పైడిపాకకు చెందిన బొత్తా త్రిమూర్తులు ఫ్యామిలీ, తమ గోడును సీఎం వద్ద వెళ్లబోసుకుంది. ఆ వెంటనే వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన జగన్, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాలరాజును ఆదేశించారు.