ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లెక్సీ కడుతుంటే విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న ఏడిద జగదీశ్ (39), ముప్పిడి శ్రీను (42) వైసీపీ అభిమానులు. జగదీశ్, తన చిన్న వయసులో హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ లో వైఎస్ జగన్ తో కలిసి చదువుకున్నాడు.
అప్పడు తాము తీయించుకున్న చిత్రాలు, జగన్ పాదయాత్రలో పాల్గొన్న చిత్రాలతో కలిపి ఓ భారీ ప్లెక్సీని తయారు చేయించారు. దానిని తన ఇంటి ముందు కట్టేందుకు శ్రీనుతో కలిసి పైకి ఎక్కాడు. ఆ సమయంలో గాలి అధికంగా వీచడంతో, ప్లెక్సీ కాస్తా ఇంటి ముందే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో ప్లెక్సీని పట్టుకుని ఉన్న ఇద్దరూ విద్యుత్ షాక్ కు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు.