గుంటూరు జిల్లాలో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వింతగా గూడ్సు రైలెక్కి సెల్ఫీ తీసుకోవాలనుకుంటే విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు.
వివరాల్లో వెళ్తే…
పిడుగురాళ్లకు చెందిన కటకంశెట్టి సైదారావు కుమారుడు వీరబ్రహ్మం అనే యువకుడు రైల్వేస్టేషన్లో ఉండగా… ప్లాట్ఫారంపైకి గూడ్స్ రైలు వచ్చి ఆగింది. వెంటనే వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో వీరబ్రహ్మం ఓ చెయ్యి పైకెత్తగా అది హైటెన్షన్ కరెంట్ తీగకు తగిలింది. కాలుతున్న శరీరంతోనే రైలు పైనుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ స్థానికులు వచ్చి మంటలు ఆర్పి యువకుడి దుస్తులు తొలగించారు.
అనంతరం రైల్వే పోలీసులు బాధితుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరబ్రహ్మం పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సెల్పీ పిచ్చిలో పడి గూడ్సు రైలెక్కి అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.