శాసనసభలో అచ్చెన్నాయుడి తీరును చూసి రాష్ట్రం అసహ్యించుకుంటోందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు ఆమె మాట్లాడుతూ అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు ఛీకొట్టేలా ఉందని నిప్పులు చెరిగారు. గత శాసనసభలో జరిగిన ఏ అంశాన్నీ ప్రజలింకా మరచిపోలేదని వ్యాఖ్యానించారు. తమను గూండాలని బెదిరించిన రోజులు ఇంకా గుర్తున్నాయని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు సభా సంప్రదాయాలను గురించి మాట్లాడుతూ ఉండటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
తాను ఓ మహిళా ఎమ్మెల్యేనన్న గౌరవం కూడా ఇవ్వకుండా గత అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు ఎలా మాట్లాడారన్న రికార్డులు ఉన్నాయని అన్నారు. గత ఐదేళ్ల పాలన ప్రజలకు నచ్చలేదు కాబట్టే ప్రజలు జగన్ కు అధికారాన్ని ఇచ్చారని చెప్పారు. తెలుగుదేశం నేతలు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ సభలో గనరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శించడానికి దారి కనిపించకనే చంద్రబాబు మైక్ ను బుచ్చయ్య చౌదరికి అప్పగించారని రోజా దుయ్యబట్టారు.