చంద్రబాబు విదేశీ పర్యటన వల్లే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ఖర్చులన్నింటినీ దుబారాగా భావించడం సరికాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక విమానాల్లో తిరిగితే, జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రత్యేక విమానాల్లో తిరిగారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరగడం సహజంగా జరిగే పరిణామమని, దాన్ని అంత ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ నుంచి గోదావరి జలాల తరలింపు ప్రమాదకరమైన ప్రయత్నమని అన్నారు. ప్రభుత్వం ఓ ప్రమాదకరమైన పథకంలో భాగస్వామి అవుతోందని హెచ్చరించారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం దయతో మనకు నీటి విడుదల ఉంటుందని యనమల వ్యాఖ్యానించారు.