తన పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ నేత సాధినేని యామిని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు అందజేశారు. తనపేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన వారు ఎవరో తెలుసుకుని కఠినంగా శిక్షించాలని ఆమె డీజీపీని కోరారు.
గుర్తుతెలియని వ్యక్తులు తనకు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తనతో పాటు తన కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఫేస్ పోస్ట్ ల వల్ల తనకు, తన కుటుంబానికి, పార్టీ ప్రతిష్టకు, గౌరవానికి భంగం వాటిల్లుతోందని చెప్పారు. తన పేరిట ఉన్న ఫేక్ అకౌంట్స్ ను వెంటనే తొలగించాలని తెలిపారు.