మేనేజ్ మెంట్ విద్య అందించే విద్యాసంస్థలలో అగ్రగామిగా ఉన్న ఎక్స్.ఎల్.ఆర్.ఐ అమరావతిలో తన శాఖను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఏపీసీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమరావతిలో క్సవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూషన్(ఎక్స్ఎల్ఆర్ఐ)కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతి క్యాంపస్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలు కేటాయించింది.
ఈ విద్యాసంస్థ శాశ్వత భవనాలు రెండేళ్లలో నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. పీజీ, యూజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో 5వేల మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు విద్యాసంస్థ సిద్ధమైంది. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ఒకటిగా ఎక్స్ఎల్ఆర్ఐ గుర్తింపు పొందింది. శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ మంత్రి నారాయణ, విజయవాడ, గుంటూరు బిషప్లతో పాటు పలు విద్యాసంస్థల ప్రముఖులు హాజరయ్యారు.