నియమనిబంధనలు చక్కగా పాటించాలని, అవి పాటించని వారికి శిక్ష వేసే వృత్తిలో ఉన్నవారు కూడా అదే తప్పు చేస్తే.. తాజాగా ఫుల్లుగా మందుకొట్టిన ఓ మహిళా న్యాయవాది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్ లో జరిగింది. ఇదే ప్రాంతానికి చెందిన ఆమె, ఓ పబ్ కు వెళ్లి మద్యం తాగి, తన ఆడి కారులో బయలుదేరారు. డైమండ్ హౌస్ వద్ద వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు ఆమె కారును ఆపగా, తొలుత తనిఖీలకు ఆమె నిరాకరించారు.
ఈ న్యాయవాదిని, మహిళా పోలీసుల సాయంతో బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 121 వచ్చింది. దీనితో ఆమె కారును పోలీసులు సీజ్ చేశారు. ఇదే సమయంలో టోలీచౌకీ ప్రాంతానికి చెందిన ఉష అనే యువతి సైతం మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చి పట్టుబడింది. ఆమె బీఏసీ 63 పాయింట్లు వచ్చింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాలలో జరిపిన తనిఖీలలో 104 మంది పట్టుబడ్డారని, వీరికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.