తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్రావుపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే భాస్కరరావు వేధిస్తున్నారని మణెమ్మ అనే మహిళ ఆరోపించారు. మిర్యాలగూడలో కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ, ఎమ్మెల్యే తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
లాయర్ వృత్తిలో ఉన్న తన భర్త ఎమ్మెల్యే బాధితుల తరఫున కేసులు వాదిస్తున్నందుకు కక్షగట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు అక్రమాలకు అడ్డొచ్చిన తన భర్త, కొడుకు, ఇతర కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు అండగా ఉన్న లాయర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపణలు రావడంతో విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేపై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.