ఎన్నికల ప్రచారంలో నేతలపై దాడులు సర్వసాధారణమైపోయింది. మొన్నటికి మొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై భౌతిక దాడికి దిగగా, అంతకుముందు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై షూ విసిరారు. తాజాగా పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పై ఒక మహిళ సిద్ధూపైకి చెప్పు విసిరింది. కాంగ్రెస్ నేత దీపేందర్ హుడా పోటీ చేస్తున్న రోహ్టక్ నియోజకవర్గంలో సిద్ధూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. తన వాగ్దాటితో మోదీపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.
ఇంతలో అటుగా వచ్చిన బీజేపీ శ్రేణులు మోదీ అంటూ నినాదాలు చేశారు. ఆ గుంపులో నుంచి ఒక మహిళ సిద్ధూపైకి చెప్పు విసిరింది. ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బుధవారం చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా, మోదీపై విమర్శలు చేస్తున్నందుకే దాడికి పాల్పడ్డానని పోలీసులకు తెలిపింది.