ఎంతో గొప్ప నూతన ఒరవడిలో జీవిస్తున్నా వరకట్నపు వేధింపులు మాత్రం ఆటవిక కాలం నుండి అలాగే కొనసాగుతున్నాయి. తాజాగా, అత్తింటి వారు ఓ కోడలిని హింసించి.. వేధించారు. ఆపై బట్టలను చింపేశారు. చేసేదేమీ లేక అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీసు స్టేషన్కు వెళ్లింది బాధిత మహిళ.
ఈ అమానవీయ సంఘటన రాజస్థాన్లోని చురూ జిల్లాలో వెలుగు చూసింది. రాజస్థాన్కు చెందిన వ్యక్తితో మహారాష్ట్రకు చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. భర్తేమో పని కోసం అసోం వెళ్లాడు. ఈ క్రమంలో సదరు మహిళపై అత్త, ఆడపడుచులు కలిసి తమ ప్రతాపం చూపించారు. ఆమెను దారుణంగా వేధింపులకు గురి చేశారు. చివరకు కోడలి బట్టలు చింపేశారు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే వెళ్లింది.
మొత్తానికి ఆమెకు పోలీసులు రక్షణ కల్పించి.. ఫిర్యాదును స్వీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె నడిరోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే కొందరు ఫోటోలు తీశారు. అయితే రోడ్డు వెంట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు తొలగించారు. ఫోటోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.