ఎవరిని బరిలో నిలపాలో తేల్చుకోలేక పోతున్నారో.. మరేదైనా వ్యూహం ఉందో ఏమో బీజేపీ పార్టీ వైఖరి కేడర్కు అంతు చిక్కడం లేదు. ఎందుకంటే నాగార్జునసాగర్ లో బీజేపీ అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. దుబ్బాక ఉపఎన్నికలో దూకుడుగా వెళ్లిన కాషాయపార్టీ సాగర్ లో భిన్నంగా వెళ్తోంది. స్థానిక పార్టీ నేతలపై బీజేపీ మొగ్గు చూపడం లేదా? ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన నివేదితా రెడ్డి ఉప పోరుకూ సై అంటున్నారు. మరో నాయకుడు అంజయ్య యాదవ్ నేనున్నాను అని చెబుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి, రవి నాయక్ లు సైతం బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి పేరు, టీఆర్ఎస్ నోముల భగత్ పేరు ప్రకటించడంతో ఆ సామాజిక వర్గం నుండి కాకుండా ఎస్టీ సామాజికవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. అయితే అలా అందుబాటులో ఉన్నవారు ఎవరో తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం.