ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ) ఆందోళనకర వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారికావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ స్పందించారు. ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంటోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల ప్రజలను మరింత ఆందోళనలోకి నెట్టేశాయి. తాజాగా నమోదైన కేసుల్లో సగానికిపైగా రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే వెలుగుచూసినట్టు అధనోమ్ తెలిపారు.
చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన నిబంధనలు అమలు చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అయితే, ఇప్పటికే విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం పాటిస్తే వైరస్ను కొంతవరకు కట్టడి చేయవచ్చని అధనోమ్ వివరించారు.