నేడు జరిగిన రెండవ టీ20లో సిమన్స్ చెలరేగడంతో భారత్పై వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ రేసులో నిలబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శివమ్ దూబే (54) అర్ధశతకం బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లూయిస్ (40), పూరన్ (38*) మెరిశారు. దీంతో మూడు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి టీ20 డిసెంబర్ 11న ముంబయిలో జరగనుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా తక్కువ పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. 15 పరుగులు, లోకేష్ రాహుల్ కూడా 11 పరుగులకు అవుట్ అయ్యారు. అయితే.. శివమ్ దూబే మాత్రం 30 బంతుల్లో నాలుగు సిక్స్లు, 3 ఫోర్లతో చెలరేగి 54 పరుగులు చేశాడు. బ్యాటింగ్ చేసినంత సేపు విండీస్ బౌలర్లను కంగారు పెట్టాడు. వాల్ష్ బౌలింగ్లో హెట్మెయిర్కు క్యాచ్గా చిక్కి ఔట్ అయ్యాడు. తొలి టీ20లో రాణించిన కోహ్లీ 19 పరుగులు చేసి విలియమ్స్ బౌలింగ్లో సిమ్మన్స్కు క్యాచ్గా చిక్కి వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ 10 పరుగులు, జడేజా 9 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ కాట్రెల్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. రిషబ్ పంత్ 33, దీపక్ చాహర్ ఒక్క పరుగు చేసి నాటౌట్గా నిలిచారు. విండీస్ బౌలర్లలో విలియమ్స్కు 2 వికెట్లు, వాల్ష్కు రెండు వికెట్లు దక్కాయి. కాట్రెల్, పియెర్, హోల్డర్కు తలో వికెట్ దక్కింది.