భారత ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం పాక్ చేరుతోన్న నదీ జలాల వాటా మీద దృష్టి సారించిందని జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ ఒప్పందానికి మించి పాక్కు చేరుతోన్న నీటిని దారి మళ్లించడమే ఇప్పుడు ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం కింద పెద్ద మొత్తంలో నదీ జలాలు పాక్ కు చేరుతున్నాయి. రావి, బియాస్, సట్లెజ్ ఉపనదుల్లో ప్రవహించే నీరు ఆ దేశానికి చేరుతోంది. పాక్కు వెళ్తోన్న మన వాటాను మళ్లించి రైతులు, పరిశ్రమలు, ప్రజల కోసం ఎలా ఉపయోగించాలన్న అంశంపై ప్రస్తుతం మేం దృష్టిసారించాం.. అని వెల్లడించారు.
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో షెకావత్ నదీజలాలకు సంబంధించి పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదే ఏడాది మేలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే ఉంటే నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేసే అంశాన్ని భారత్ పరిశీలిస్తుందని హెచ్చరించారు. 1960లో భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్కు మధ్య సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. దాని ప్రకారం తూర్పును ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు లభించడంతో పాటు పశ్చిమం వైపున ప్రవహించే సింధు, చినాబ్, జీలమ్ నదులు ఏ ఆటంకం లేకుండా పాక్ కు ప్రవహిస్తాయి. పాక్లోకి ప్రవహించే నదుల్లోని నీటిని ఉపయోగించే హక్కు ఆ ఒప్పందం ప్రకారం భారత్కు ఉంది.
పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ