ఈనెల 15 నుంచి గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు జడ్పీ సీఈవో జి.చక్రధరబాబు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ.. ఒక్కో వలంటీర్కు 50 ఇళ్లను అప్పగించి మాపింగ్ చేపడుతున్నట్లు చెప్పారు. ఇళ్లు కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నందున వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వలంటీర్ పరిధిలో ఎన్నెన్ని కేజీల బియ్యం పంపిణీ జరుగుతుందో ముందుగా గుర్తించి వారికి ప్యాకెట్లో బియ్యాన్ని వచ్చేనెల ఒకటి నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబరు ఒకటి నుంచి తెలుపు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని పైలట్ ప్రాజెక్ట్గా చేపడుతున్నామన్నారు.
అక్టోబరు 2 నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో 835 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయగా 45 సచివాలయాలకు సొంత భవనాలు లేవని చెప్పారు. అటువంటి వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 10 వరకు గడువు ఉందని, అయితే ఆన్లైన్లో దరఖాస్తుకు సర్వర్లు బిజీ వల్ల అంతర్జాలంలో నమోదుకు అవకాశం ఉండకపోవచ్చని, అందువల్ల గడువుకు 2 రోజుల ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు గ్రామ సచివాలయాల పోస్టులకు 10 లక్షలు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు జరిగినట్లు చెప్పారు. ఆయనతో పాటు ఎంపీడీవో జె.తేజరతన్, ఈవోపీఆర్డీ జి.శ్యామలాదేవి ఉన్నారు.
కేంద్ర బడ్జెట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు: యనమల