విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం 2017లో ఏఎంఆర్సీకి అప్పగించిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్లని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నూతన డీపీఆర్ సిద్ధం చేసేందుకు కొత్త కన్సెల్టెంట్ కు బాధ్యతలు అప్పగించింది.
ఓపెన్ టెండర్ ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్ల ఆహ్వానానికి నిర్ణయం తీసుకుంది. టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు.తొలి దశలో ఈ ప్రాజెక్టును గాజువాకతోనే ఆపకుండా స్టీల్ ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ మేరకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫస్ట్ ఫేజ్లో అదనంగా నాలుగు కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది.