మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కుటుంబసభ్యులను లొంగదీసుకొని వైసీపీ అధినేత జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకా హత్య కేసును విచారిస్తున్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేశారని చంద్రబాబు విమర్శించారు.
వివేకాను హత్య చేసి సాక్ష్యాలను తారు మారు చేశారని బాబు ఆరోపించారు. ప్రాణాలను కూడ లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులను చంద్రబాబు అభినందించారు. జగన్కు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. తెలంగాణ పోలీసులపైనే జగన్ నమ్మకం ఉందని ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. జగన్ కేసీఆర్కు ఊడిగం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. వైసీపీ ఫిర్యాదు చేయగానే కనీసం నోటీసులు కూడ ఇవ్వకుండానే ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని ఈసీ పై చంద్రబాబు మండిపడ్డారు.