telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వినోదాల విందుగా ‘వివాహ భోజనంబు’ టీజర్

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన సినిమా ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయిక. నిర్మాణ సంస్థలు ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ సినిమా టీజర్ ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.

టీజర్ బట్టి కరోనా నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథతో రూపొందిన వినోదాత్మక చిత్రమిది అని అర్థమవుతోంది. వినోదాల విందుకు ఏమాత్రం లోటు లేదని తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ప్రేరణతో సినిమాను తెరకెక్కించమని చిత్రబృందం టీజర్ లో పేర్కొంది.

అసలు కథ విషయానికి వస్తే… పది రూపాయలు పార్కింగ్ టికెట్ కొనడానికి, స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ (సత్య). కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. కానీ, ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్ని కష్టాలు పడ్డాడనేది తెరపై చూడాలని చిత్రబృందం చెబుతోంది. సందీప్ కిషన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, కథానాయకుడిగా సత్య అద్భుతంగా నటించాడనీ యూనిట్ వర్గాలు తెలిపాయి.

Related posts