telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రకంపనలు సృష్టిస్తున్న విశాఖ ఉక్కు ఉద్యమం…

విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా మూడో  రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు, నిర్వాసిత గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.  విశాఖ ఉక్కును అమ్మేది ఎవడు కొనేది ఎవడు నినాదాలతో హోరెత్తించారు.మరో వైపు, ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటానికి ఉద్యోగ,కార్మిక,ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అయ్యాయి. దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలను ఉద్యోగ సంఘాల జేఏసీ రూపొందించింది. ఆర్టీసీ, NGO, విద్యుత్, మునిసిపల్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు దశల వారీగా రోడ్డెక్కాలని నిర్ణయించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాల ను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళుతున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.  ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పరిశ్రమను కాపాడుకునేందుకు రాజకీయపార్టీలు ఒక్క తాటిపైకి వస్తున్నాయి. ఉక్కు కార్మిక సంఘాలు తగిలించిన ఉద్యమ సెగలు ఢీల్లికి తాకేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు కీలకంగా మారనున్నాయి. లక్షల మందిని సంఘటితం చేయడం, పార్లమెంట్ వేదికగా గళం విప్పడం, నిరంతరం పోరాటం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించడంపై అఖిలపక్షం చర్చించింది. ఈ మేరకు ఆందోళనలో ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా కల్పించేందుకు గేట్ మీటింగ్ లు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts