కేంద్ర ప్రభుత్వం రెండురోజుల క్రితం గ్యాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఐ వినూత్న నిరసన చేపట్టింది. ఈరోజు ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో ఏకంగా రోడ్డుపైనే కట్టెల పొయ్యి ఏర్పాటుచేసి దానిపై పాలు కాస్తూ ‘ఈ ప్రభుత్వాల హయాంలో భవిష్యత్తు ఇదే’ అంటూ నినాదాలు చేసి ఆకట్టుకుంది.
ముందు ఆర్టీసీ చార్జిలు, ఆ తర్వాత విద్యుత్ చార్జీలు, తాజాగా గ్యాస్ ధరలు…ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని అన్నట్లు వరుసగా ధరలు పెంచుతూ సామాన్యుడి నెత్తిపై భారాన్ని వేస్తుండడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తక్షణం పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.