ఇటీవల భారత్-పాక్ మధ్య బాగా నలిగిపోయిన దేశంలో అమెరికా ఒకటి. పాక్ ను ఇష్టం లేకున్నా వ్యతిరేకించాల్సి వచ్చిన అమెరికా కూడా భారత్ ధర్మపోరాటం ముందు తలవంచక తప్పలేదు. ఇది చేదుగా భావించిన పాక్, అమెరికా నుండి తమ దేశానికి వచ్చే వారి వీసాల గడువును గరిష్టంగా తగ్గిస్తూ ఆదేశాలు జారీచేసింది. దానితో నేనేమైన తక్కువ తిన్నానా అంటూ అమెరికా కూడా అదే పని చేసి టిట్ ఫర్ టాట్ అని తేల్చి చెప్పింది. ఉగ్రవాదం విషయంలో పలు దేశాల నుంచి మొట్టికాయలు వేయించుకుంటున్న పాక్కు తాజాగా అమెరికా వీసా షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ పౌరులకు సంబంధించి వివిధ కేటగిరీ వీసాల కాలపరిమితిని తగ్గించింది.
ఈ మేరకు పాకిస్థాన్లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి కొత్త విధివిధానాలను మంగళవారం వెల్లడించారు. వర్క్, మిషనరీస్కు సంబంధించిన వీసాల గడువును ఐదేళ్ల నుంచి ఏడాదికి కుదించింది. జర్నలిస్టుల వీసాల గడువును కూడా ఐదేళ్ల నుంచి మూడు నెలలకు తగ్గించింది. పాక్ పౌరులకు వీసా దరఖాస్తు రుసుమును కూడా 160 డాలర్ల నుంచి 192 డాలర్లకు పెంచింది. అయితే, వర్తక, టూరిజం, స్టూడెంట్ వీసాల కాలపరిమితి మాత్రం ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.