telugu navyamedia
క్రీడలు వార్తలు

మొబైల్ ప్రిమియ‌ర్ లీగ్ ‌లో కోహ్లీ పెట్టుబడులు..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల వివాదంలో చిక్కుకున్నాడు. ప్ర‌స్తుతం బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్స‌ర్‌గా ఉన్న మొబైల్ ప్రిమియ‌ర్ లీగ్ సంస్థ‌లో కోహ్లీకి పెట్టుబడులు ఉండ‌ట‌మే.. భారత కెప్టెన్‌ను చిక్కుల్లో పడేసింది. గతేడాది జ‌న‌వ‌రిలో ఎంపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కోహ్లీ నియ‌మితుడ‌య్యాడు. అప్పుడే అత‌ని పేరిట రూ.33.32 ల‌క్ష‌ల విలువైన‌ 68 సీసీడీల‌ను కేటాయించారు. వీటిని ప‌దేళ్ల త‌ర్వాత ఈక్విటీ షేర్ల‌లోకి మార్చుకోవ‌చ్చు. ఆ లెక్క‌న విరాట్ కోహ్లీకి ఎంపీఎల్‌ కంపెనీలో 0.051 శాతం వాటా ఉన్న‌ట్లే. ఇదే ఎంపీఎల్ స్పోర్ట్స్‌ను గతేడాది నవంబ‌ర్ 17న అధికారిక కిట్ స్పాన్స‌ర్‌గా బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ ఎంపీఎల్ లోగో ఉన్న జెర్సీల‌ను ఆస్ట్రేలియా టూర్ నుంచే టీమిండియా వేసుకుంటోంది. మూడేళ్ల పాటు ఈ సంస్థ‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కోహ్లికి ఈ సంస్థ‌లో వాటా ఉన్న‌ట్లు బీసీసీఐకి తెలియ‌ద‌ని ఓ బోర్డు అధికారి చెప్ప‌డం గ‌మ‌నార్హం. విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయ‌ర్‌కు ఇలాంటి క‌నెక్ష‌న్లు ఉండ‌టం స‌రికాద‌ని మ‌రో బీసీసీఐ అధికారి అన్నారు. నిజానికి గతేడాది జులైలోనే కోహ్లీ ప‌రస్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల అంశాన్ని ఎథిక్స్ ఆఫీస‌ర్ డీకే జైన్ లేవ‌నెత్తారు. ఇప్పుడు మరోసారి తెరమీదికి వచింది. మ‌రి ఈ అంశంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఈ విషయంలోనే గతంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్‌ సహా అనేక మందిపై మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ రాజ్యాంగంలోని 38 నిబంధనకు వ్యతిరేకమని తెలిపారు.

Related posts