దేశరాజధాని ఢిల్లీలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్ధులు చేపట్టిన నిరసన హింసాత్మకంగాఢి మారింది. నిరసన తెలుపుతున్న విద్యార్ధులు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పౌర బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ తాము చేపట్టిన ఆందోళనను అడ్డుకున్నారంటూ జేఎంఐ విద్యార్ధులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వర్సిటీ క్యాంపస్ నుంచి పార్లమెంట్ వరకూ విద్యార్ధులు నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. క్యాంపస్ వద్దనే పోలీసులు విద్యార్దులను అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. 50 మంది విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తమపై బలప్రయోగం చేయడం సరికాదని విద్యార్ధులు ఆరోపించారు.