పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఇంటర్నల్గా ప్రజలు కట్టడి పాటించడం లేదని విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు అన్నారు. ఈ సమస్యే కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని తెలిపారు. విజయవాడలో ఆరు రెడ్ జోన్లు ఉన్నాయి. వీటిని ఈరోజు పరిశీలించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘రెడ్జోన్లలో నివసిస్తున్న వారు ‘ఇక్కడిక్కడే కదా’ అన్న ఉద్దేశంతో నివాసాల సమీపంలో ఫ్రీగా తిరిగేస్తున్నారు.
చుట్టుపక్కల పోలీసులు ఎంత గట్టినిఘా పెట్టినా ఇంటర్నల్గా ప్రజలు కట్టడి పాటించక పోవడంతో వైరస్ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. బయట వ్యక్తులను లోపలకు అనుమతించక పోయినా లోపల ఉన్న వారు అక్కడ తిరుగుతుండడంతో సమస్య ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రెడ్జోన్ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. అలాగే మొబైల్ వాహనాల్లో పోలీసులు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.