పార్టీ ఫిరాయించే నేతలపై ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, నటి విజయశాంతి ప్రశంసలు కురిపించారు.ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి రావాలంటే వారి పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ స్పష్టం చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై విజయశాంతి స్పందించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫిరాయింపుదారులను పార్టీలోకి తీసుకోబోమనీ, అన్ని పదవులకు రాజీనామా చేశాకే వారు వైసీపీలోకి రావాలని జగన్ తీసుకున్న నిర్ణయం అరాచకాలకు చెంపపెట్టు అని అన్నారు.
రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయ్యాక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా అనిపిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విజయశాంతి విమర్శించారు. స్పీకర్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో హైకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయని గుర్తుచేశారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పీకర్ ను ఎన్నుకుని ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టిన వెంటనే అధికార పక్షం చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందని విజయశాంతి పేర్కొన్నారు.