తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నాయకురాలు ఫైర్ అయ్యారు. తెలంగాణలో ధరణి పేరిట ఆస్తుల ఆన్లైన్ అంటూ ప్రారంభించిన నమోదు ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా కొనసాగుతోందో ప్రచార మాధ్యమాలు కళ్ళకు కట్టినట్టు వెల్లడిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయశాంతి. సాంకేతిక సమస్యలు ఒకవైపు…. శిక్షణలేని సిబ్బందితో మరోవైపు…. చివరికి వేదన మాత్రం ప్రజలకా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు పన్నులు కడితేనే ఆస్తుల్ని ఆన్లైన్ చేస్తామనే హెచ్చరికలు… ఎంతో కొంత ముట్టజెపితేగాని నమోదు చేసుకోమనే బెదిరింపులతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయంటూ ఆమె పేర్కొన్నారు.
ఇక కోవిడ్ విషయానికొస్తే అయితే గాంధీలోనో… లేదా నిమ్స్లోనో ఫ్రంట్ లైన్ వారియర్ల ధర్నాలు, నిరసనల పరంపర కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఇవి చాలక డబుల్ బెడ్రూం ఇళ్ళ పేరిట ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రయివేట్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల బాధలు… రైతుల ఆవేదనకు అంతులేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే పాలకవర్గం తప్ప మరే వర్గమూ ప్రశాంతంగా లేని పరిస్థితులు నేడు తెలంగాణలో నెలకొన్నాయని తెలిపారు. కేసీఆర్ దొరగారు పరిపాలనను అటకెక్కించి టీఆర్ఎస్ గెలుపు కోసం పూర్తిగా దుబ్బాక ఉపఎన్నిక పైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని ఫైర్ అయ్యారు విజయశాంతి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గ్రహించడం మంచిదని హెచ్చరించారు.