తెలంగాణలో పార్టీనీ బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు. పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ విషయంలో అమిత్ షా తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
గ్రామ స్థాయి నుంచి హైదరాబాదు వరకు పార్టీని బలోపేతం చేయాలంటూ రాష్ట్ర పార్టీ నేతలకు ఇప్పటికే ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. ఆమె తో పాటు ఒక మాజీ ఉపముఖ్యమంత్రి, పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురితో పార్టీ నాయకత్వం చర్చలు జరిపిందని, సంప్రదింపుల వ్యవహారం మొత్తం బీజేపీ జాతీయ నాయకత్వం కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం.