తెలుగు సినిమాలో ఓ విలక్షణమైన నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడు. ఆయన ఈరోజు హైద్రాబాద్ లో మరణించారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సినిమా మీద ఎంతో అభిరుచి, అవగాహన వున్న వ్యక్తి బాపినీడు. “విజయ ” అనే పత్రికను ప్రారంభించి విజయవంతంగా నడిపారు. అందుకే ఆయనకు విజయ బాపినీడు అన్న పేరు స్థిరపడింది. నిజానికి ఆయన పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఆయన 22 సెప్టెంబర్ 1936లో పశ్చిమ గోదావరి జిల్లా లోని చాట పర్రులో సీతారామ స్వామి, లీలావతి దంపతులకు జన్మించారు. విజయ తో పాటు బొమ్మరిల్లు, నీలిమ అన్న రెండు పత్రికలూ కూడా బాపినీడు సంపాదకత్వంలో వచ్చాయి. పత్రికా రంగంలో బాపినీడు తనదైన ప్రత్యేకత సాధించాడు.
బాపినీడు ఏలూరులోని సి.ఆర్.ఆర్ కాలేజీలో బీఏ చదివాడు. మొదటి నుంచి ఆయనకు జర్నలిజం అన్నా, సినిమా అన్నా ప్రాణం. అందుకే చదువు అయిపోయిన తరువాత మద్రాస్ వెళ్ళిపోయాడు. అప్పటికే చాటపర్రు నుంచి వెళ్లిన మురళి మోహన్ హీరోగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో బాపినీడు ముందు విజయ అన్న మాస పత్రికను ప్రారంభించాడు. అప్పట్లో ఈ పత్రికను పాఠకులు బాగా ఆదరించారు.
ఆ తరువాత ఆ తరువాత ఏలూరు కు చెందిన మాగంటి రవీంద్రనాథ్ తో 1976లో “యవ్వనం కాటేసింది ” చిత్రం దాసరినారాయణ రావు దర్శకత్వంలో నిర్మించాడు. ఆ తరువాత “బొమ్మరిల్లు”, “బొట్టు .. కాటుక “, “విజయ ” లాంటి సినిమాలు రూపొందించాడు.
1981లో స్వంత కంపెనీ ప్రారంభించి నిర్మాణంతో పాటు దర్శకత్వం వహించడం మొదలు పెట్టాడు. డబ్బు డబ్బు డబ్బు, పట్నం వచ్చిన ప్రతి వ్రతలు, మగమహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, భార్యామణి, మహారాజు, కృష్ణగారడి, దొంగల్లో దొర, మగధీరుడు, నాకు పెళ్ళాం కావాలి, ఖైదీ నెం 786, దొంగ కోళ్ళు, మహారాజశ్రీ మాయగాడు, సుమంగళి, జూ లకటక, మహాజనానికి మరదలు పిల్ల, గ్యాంగ్ లీడర్, వాలు జడ తోలు బెల్ట్, సీతాపతి చలో తిరుపతి, బిగ్ బాస్, ఫామిలీ, కొడుకులు సినిమాలకు ఆయన దర్శకత్వం చేశాడు.
ఆయన ఎక్కువగా చిరంజీవి, శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ తో చిత్రాలు నిర్మించాడు. 1982లో చిరంజీవి, మోహన్ బాబు తో “పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రం తీశాడు. ఈ సినిమా విజయవంతం అయ్యింది. ఆ తరువాత బాపినీడు గారికి చిరంజీవితో అనుబంధం మొదలయ్యింది. మగమహారాజు, మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నెం 786,బిగ్ బాస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చాడు. చిరంజీవికి మెగా స్టార్ కావడాన్ని బాపినీడు కృషి ఎంతో ఉంది.
కేవలం చిరంజీవి ఇమేజ్ పెంచడానికే “చిరంజీవి ” అన్న పత్రికను ప్రారంభించాడు. అంటే కాదు తెలుగు సినిమా మద్రాస్ నుంచి హైద్రాబాద్ కు తరలి వచ్చినప్పుడు, బాపినీడు తాను ఫిలిం నగర్లో కట్టుకున్న ఇల్లు చిరంజీవికి ఇచ్చి ఉండమన్నాడు. చిరంజీవి అంటే అంత అభిమానముగా ఉండేవాడు.
1998లో ఆయన నిర్మించిన “కొడుకులు ” చివరి సినిమా. ఈ సినిమా ఆయనకు తృప్తినివ్వలేదు. బాపినీడు గారికి ముగ్గురూ కుమార్తలే. మగ పిల్లలు లేరు. ఇక బాపినీడు సినిమాలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడానికి పబ్లిసిటీ లో ఆయన విలక్షణమైన శైలి అవలంభించేవాడు. ఆ తరువాత చాలా మంది బాపినీడును అనుసరించారు బాపినీడు కమర్షియల్ సినిమాలను ఎంత పట్టుదలతో తీసి విజయం సాధించేవాడో, ఆలాగే బొట్టు, కాటుక అనే సంప్రదాయ సినిమాలను కూడా తీసి తన అభిరుచిని చాటాడు.
తెలుగు సినిమా రంగంలో బాపినీడుడు విలక్షణమైన శైలి, నిర్మాతగా దర్శకుడుగా ఆయన సినిమా మీద వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు.