టీడీపీ హయాంలో బీసీలు పూర్తిస్థాయిలో అణిచివేతకు గురయ్యారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీ సోదరులకు అడుగడుగునా అవమానాలు, ఛీత్కారాలు ఎదురయ్యాయని చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో చంద్రబాబునాయుడు బీసీలను తాట తీస్తా.. తోలు వలుస్తా.. తోక కత్తిరిస్తా.. అంటూ హెచ్చరించారని, అందుకే బీసీలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. బీసీల్లో అన్ని కులాల వారికి సమాన లబ్ధి కలిగేలా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని స్పష్టంచేశారు. జగనన్న పాలనలో బీసీలు శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నారని, వెనుకబడిన తరగతుల వారికి తమ ప్రభుత్వం ఒక వరమని.. బీసీలు ఎప్పటికీ జగనన్నకు తోడుగా ఉంటారని తెలిపారు. ఏడాదికి రూ.20వేల కోట్లకు పైగా నిధులను బీసీ సబ్ప్లాన్ కింద తమ ప్రభుత్వం ఖర్చుపెడుతున్నదని, ఇది ఒక చరిత్ర అని చెప్పారు. బీసీల గుండెల్లో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.