షాద్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివారులో హత్యకు గురైన మహిళను వెటర్నరి డాక్టర్ ప్రియాంక రెడ్డిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో వెటర్నరీ వైద్యురాలుగా పనిచేస్తున్నారు.నిన్న విధులకు వెళ్లి ఆమె ఇంటికి తిరిగిరాలేదు.
ప్రియాంకారెడ్డి స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ దగ్గర నర్సంపేట. దుండగులు చెటాన్పల్లి బైపాస్ రోడ్డు అండర్ బ్రిడ్జి కింద హతమార్చి తగులబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ప్రియాంకారెడ్డి ఉదయం స్కూటీ మీద ఆఫీస్కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఉండగా స్కూటీ పాడైపోయిందని సోదరికి ఫోన్ చేసి చెప్పింది. హైవేపై భయమవుతోందని తెలిపింది. ఇంటికి కాల్ చేసిన కాసేపటికే ప్రియాంక ఫోన్ స్విచ్ఆఫ్ అయింది. తెల్లారేసరికి ప్రియాంకారెడ్డి మృతదేహం కాలిబూడిదైంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.