telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో మరో విషాదం… ప్రముఖ గాయకుడు ఏఎల్ రాఘవన్ కన్నుమూత

AL

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సాచీ (కె.ఆర్.సచ్చిదానందన్) కన్నుమూశారు. ఆ వార్త మరువక ముందే… తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు ఏఎల్ రాఘవన్ నిన్న మరణించారు. రాఘవన్ వయసు 80 ఏళ్లు. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన కుప్పకూలారు. దీంతో ఆయనను భార్య ఎంఎన్ రాజం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాఘవన్ చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని రోయపెట్టాలోని నివాసానికి తరలించారు. 1947లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని రాఘవన్ ప్రారంభించారు. సింగర్‌గా వేలాది పాటలు పాడారు. చివరిగా 2014లో విడుదలైన ఆడమా జైచోమాడ చిత్రంలో సీన్ రోల్డాన్ సంగీత సారథ్యంలో ‘నల్లా కేతుక్కా పాదం’ అనే పాట పాడారు. నెంజిల్ ఒరు ఆలయంలో రాఘవన్ పాడిన ‘ఎంకిరుంతాళం వాళ్గా’ పాట ఎవర్ గ్రీన్‌ సాంగ్‌గా నిలిచిపోయింది. రాఘవన్ భార్య రాజం కూడా సినిమాల్లో నటించేవారు. లెజండరీ సంగీత దర్శకులైన కేవీ మహదేవన్, ఎస్‌ఎం సుబ్బానాయుడు, ఘంటసాల, విశ్వనాథ్‌-రామ్మూర్తి, టీవీ రాజు, ఎస్‌పీ కోదండపాణిలాంటి వారితో కలిసి పని చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జిక్కి, పి.లీల వంటి ప్రముఖ గాయకులతో కలిపి ఎన్నో పాటలు పాడారు. ఎన్టీఆర్ నటించిన ‘నిండు మనసులు’, ‘నేనే మెనగాణ్ణి’ చిత్రాల్లో పాటలు పాడారు. ‘కులగౌరవం’ అనే తెలుగు సినిమాలో ‘హ్యాపీ లైఫ్’‌ అంటూ సాగే పాట‌ను ఎల్‌.ఆర్‌.ఈశ్వరితో కలిసి ఆయన ఆలపించారు. దీంతో అటు తమిళ ఇండస్ట్రీతోపాటు.. ఇటు తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు రాఘవన్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Related posts