హైదరాబాద్లో కనుమరుగువుతున్న చెరువులు, కుంటలను రక్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో తీసుకుంటున్న చర్యలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమర్థించారు.
ప్రభుత్వాన్ని అభినందించారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది మంచిదేనని ప్రశంసించారు. అయితే, ఆక్రమణల కూల్చివేత విషయంలో అందరినీ ఒకేలా చూడాలని, ఈ కారణంగా నష్టపోయిన పేదలను ఆదుకోవాలని సూచించారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిన్న ‘ఉన్నత్ భారత్ అభియాన్’ పేరిట నిర్వహించిన వర్క్ షాప్ లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
దేశం బాగుండటం అంటే మనుషులతోపాటు నదులు, చెరువులు, అడవులు, పశువులు, పక్షులు వంటివి కూడా బాగుండాలని పేర్కొన్నారు.
గ్రామీణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తనను రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెట్టిన సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతోనే పాఠశాలలు, యూనివర్సిటీలు, సాంస్కృతిక సంస్థలకు వెళ్లి సహకారం అందిస్తున్నట్టు వెంకయ్య తెలిపారు.