ప్రస్తుతం మీడియా ప్రసారం చేస్తున్న కథనాల పై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాం ప్రెస్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ప్రారంభ వేడుకలలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పాత్రికేయ వృత్తి ఓ మిషన్లా ఉండేదని, కానీ ఇప్పుడు జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతిందని వ్యాఖ్యానించారు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యలను పారదోలేందుకు నిర్భయంగా వార్తలు రాసేవారని వెంకయ్య గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తారుమారైందని అన్నారు.పెయిడ్ ఆర్టికల్స్, పక్షపాత వైఖరి నేటి పాత్రికేయానికి పెద్ద శాపాలుగా పరిణమించాయన్నారు. తామేం చేస్తున్నామన్న దానిపై ఫోర్త్ ఎస్టేట్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సంచలనం కోసం ప్రయత్నించడం, చెల్లింపు వార్తలు, పక్షపాత వైఖరితోపాటు నకిలీ వార్తలు కూడా జర్నలిజానికి పెను సమస్యగా పరిణమించాయన్నారు. బ్రిటిష్ పాలనలోను, ఎమర్జెన్సీ సమయంలోను వార్తా పత్రికలు కీలక పాత్ర పోషించాయని వెంకయ్య గుర్తు చేశారు. వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకోవడం వల్ల జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింటోందని పేర్కొన్నారు. తాము ప్రచురించే వార్తల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మీడియా సంస్థలు నియంత్రణ పాటించాలని వెంకయ్య కోరారు.