దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు జీవిత కథలతో సినిమాలు తీసి సంచలనాలు సృష్టించడమే గాక, సరికొత్త వివాదాలకు కూడా తెరతీశారు. తాజాగా, జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్పై ‘ముప్పావలా’ అంటూ కొత్త సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని కొనసాగించారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ అసలు విషయం చెప్పి ఈ తాజా వివాదానికి ముగింపు పలికారు. అసలు ఏం జరిగిందంటే.. రాంగోపాల్ వర్మ అధికారిక ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గురించిన ఓ సినిమా ప్రారంభిస్తున్నట్లు జనవరి 16న ప్రకటించారు. ఆ సినిమాకు ‘ముప్పావలా’ అనే పేరును ఖరారు చేశారు. దీంతో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మపై విమర్శలు ఎక్కుపెట్టారు.
తాజాగా ఈ సినిమాపై వర్మ స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్పై తాను ఎలాంటి సినిమా తీయడం లేదని స్పష్టం చేశారు. ఆ ట్వీటు కూడా తాను చేయలేదని చెప్పారు. ఆ ట్వీటు కావాలనే ఎవరో క్రియేట్ చేశారని అన్నారు. కావాలంటే తన ట్విట్టర్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ముప్పావలాపై స్పష్టత వచ్చినట్లయింది. కాగా, రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్కు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కామెంట్ల రూపంలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుని జగన్ అభిమానులు పవన్పై విమర్శలు గుప్పిస్తుంటే.. జగన్ కేసులను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. వివరణ ఇచ్చినప్పటికీ మరికొందరు వర్మపైనా విమర్శలు చేస్తుండటం గమనార్హం.