గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీకి రాజీనామా చేసి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. దీర్ఘకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి…అధికారం పోయిన తర్వాత ఐదారు నెలలు కూడా ఆ హోదాలో ఉండలేకపోతున్నారని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోలేదు. ఏ ప్రభుత్వానికి అయిన కొంత సమయం ఇవ్వాలి. వరదలు, ప్రకృతి వల్ల ఇసుక తీయడం కుదురుతుందా? వరదలు, వర్షాల్లో కూడా ఇసుక తీసే పరిజ్ఞానం చంద్రబాబుకి ఉందేమోనని ఎద్దేవా చేశారు. మంచి పనులు చేస్తే స్వాగతించాలని వంశీ సూచించారు. డబ్బున్న వారి పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతుంటే పేదవారు చడవకూడదా అని వంశీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వస్తున్న విమర్శలను తప్పుపట్టారు. ఈ విషయంలో తాను ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నానని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. “తెలుగుదేశం పార్టీ పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన జాతీయ పార్టీలా మిగిలింది. టీడీపీ ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత మరో మాట చెబుతుంది. దీంతో ప్రజల్లో విశ్వాసం పోతోంది.
పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పణంగా పెట్టి ప్రచారం చేశారు. అయినప్పటికీ…ఆయన్ను చంద్రబాబు దూరం పెట్టారు. ధర్మ పోరాట దీక్షలు వద్దన్నా వినలేదు. ఇదే విధంగా తెదేపా వ్యవహరిస్తే తెలంగాణలాగే ఇక్కడ కూడా పార్టీ మిగలదు. ఏ ఎన్నికల్లోనూ తెదేపా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. ఇసుక దీక్ష వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో తెదేపా నాయకులు చెప్పాలి“ అని వ్యాఖ్యానించారు. ప్రజలు మెచ్చి గెలిపించిన నాయకుడికి మద్దతివ్వల్సిన అవసరం ఉందని వైసీపీకి మద్దతుపై తన అభిప్రాయాన్ని వల్లభనేని వంశీ ప్రకటించారు. జగన్కు మద్దతిస్తే తనకు ఎలాంటి ప్రయోజనం లేదు, కేసులు కొత్త కాదు అని వంశీ వెల్లడించారు. `తెదేపాలో ఉన్నప్పుడే నాపై కేసులు పెట్టారు. కేసులకు నేను భయపడను. తప్పుడు కేసులు పెట్టిన వారిని ఎదుర్కొంటాను. పేదలకు, నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం ఏదైనా చేస్తాను. వైకాపాకు మద్దతిస్తా… జగన్ తో కలిసి నడుస్తా. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.వారసత్వ రాజకీయాలు నాకు అవసరం లేదు. అవసరమైతే పదవికి రాజీనామా చేస్తా. తెదేపా ఎమ్మెల్యేగా ఉండి…. వైకాపాకు మద్దతిస్తున్నాను. దీని ద్వారా ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా ఎదుర్కొంటానని వంశీ ప్రకటించారు.