ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు చిరంజీవితో సహా 10 మంది పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తమ రక్తంతో మెగా కుటుంబం కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు అంటూ గత కొద్ది రోజులుగా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో కొణిదల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తమతో ఒక ఎగ్రిమెంట్ కుదుర్చుకుని ఇప్పుడు సినిమా పూర్తి అయ్యాక తమను మోసం చేస్తున్నారు అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు తాము తమ ఎగ్రిమెంట్ గురించి ఆందోళన చేస్తుంటే తమను ఆందోళనలు విరమించమని కొందరు బెదిరిస్తున్నారని అంటూ మరో సంచలన ఆరోపణ చేస్తున్నారు.
తమ డిమాండ్స్ ముందుకు తీసుకు వెళ్ళడంలో కొందరి సహకారం తీసుకుంటున్నామని చెపుతున్న ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు అప్పట్లో తాము చరణ్ తో కుదుర్చుకున్న ఎగ్రిమెంట్ లో 22 మంది వ్యక్తుల సంతకాలు ఉన్నాయని చెపుతున్నారు. అంతేకాదు ఆ ఎగ్రిమెంట్ ప్రకారం తమకు 50 కోట్లు పరిహారంగా రావాలని మరొకసారి వారి డిమాండ్ ను ముందు పెడుతున్నారు. ఈ వివాదానికి మరో ట్విస్ట్ ఇస్తూ తమ డిమాండ్స్ ను పరిష్కరించకపోతే చిరంజీవి ఇంటి ముందు తాము అంతా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం మరింత సంచలనంగా మారింది. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో సెన్సార్ బోర్డ్ చిరంజీవి రామ్ చరణ్ సురేంద్ర రెడ్డిలతో పాటు అమితాబచ్చన్ పేరు కూడా ప్రస్తావించడం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఈ వివాద ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.