సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని.. కర్ణాటకతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీఆర్ఎస్ పని ఖతం అవుతుందని అన్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరేందుకు కసరత్తు నడుస్తోందని తెలిపారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రపతి పాలనలోనే నిర్వహించాలని కోరతామని తెలిపారు.
గవర్నర్ వ్యవస్థను తెరాస ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. నియోజకవర్గాల్లో కూడా ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు.
ఉమ్మడి ఏపీలో పోలీసు వ్యవస్థకు మంచి పేరు ఉండేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాలు, దోపిడీ కోసం పోలీసులను వాడుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అనుకూలంగా ఉన్నవారికే పదోన్నతులు ఇస్తున్నారని మండిపడ్డారు.